Skip to main content

ఆచార్య యన్. జి. రంగా

India post released a Commemorative Postage Stamp on N.G.Ranga on 27th January  2001 under personlity series.
రైతుబంధు ఆచార్య యన్.జి.రంగా గారి చిరస్మరణీయ సేవలకు గుర్తింపుగా భారతీయ తపాలాశాఖ వారు,27th జనవరి 2001 లోఒక ప్రత్యేక స్మారక తపాళాబిళ్ళను విడుదల చేశారు.
Prof.N.G.RANGA (7 Nov1900–9 June 1995)

ప్రపంచ కర్షకులారా ఏకంకండి !
ఈ నినాదానికి రూపశిల్పి ఆచార్య గోగినేని రంగనాయకులు ( యన్. జి. రంగా). రైతు కూలీలకోసం ప్రత్యేకంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మహామనీషి. రైతుకూలీలరాజ్యం స్థాపనకోసం మహాత్మునితో సుదీర్ఘచర్చలను జరపడమే కాక, సంభాషణలసారాన్ని, 'బాపూ ఆశీస్సులూ ' అని గ్రంధస్థం చేసిన వ్యక్తి. గాంధీజీ స్వతంత్ర్యోద్యమంలో భాగంగా 1933 లో ప్రకటించిన క్లారియన్ పిలుపునందు కున్న స్వతంత్ర సమరయోధుడు. 1936లో కిసాన్ కాంగ్రేస్ పార్టీని స్థాపించిన ధైర్యశాలి. ఆరు దశాబ్దాలకాలం ప్రజాసేవ చేసిన ప్రజ్ణామూర్తి.
1900 సంవత్సరం నవంబర్ 7 న గుంటూరు జిల్లాలోని నిడుబ్రోలు గ్రామంలో జన్మించిన రంగా, స్వగ్రామంలోనే ప్రాధమిక విద్యను అభ్యసించి. గుంటూరులోని ఆంధ్ర-క్రిష్టియన్ కాలేజీలో పట్టభద్రులవగా, 1926లో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో, ఆర్ధికశాస్త్రంలో బి.లిట్.చేసి, మద్రాసు లోని పచయప్పకాలేజీలో ఆర్ధికశాస్త్రంలో ఆచార్య పదవిలో బహుళ రాణింపుపొందిన ప్రముఖుడు.
గాంధీజీ పిలుపునందుకుని, స్వాతంత్ర్యోద్యమంలో చేరిన రంగా రాజకీయ ప్రవేశం చేసి, ఆ తరువాత కాంగ్రేసుని వీడి, స్వంతంగా భారత్ కృషికార్ లోక్ పార్టీని, రాజాజీతో స్వతంత్ర పార్టీని స్థాపించి, స్థాపకాధ్యక్షుడుగా ఎన్నికైన రంగా, దశాబ్దకాలంపాటు అదే పదవిలో రాణించాడు. 1957-62 నుంచి 1989-1991 వరకు, కొద్ది కాలం తప్పితే, నిరాఘాటంగా, పార్లమెంట్ లో రాజకీయప్రతినిధిగా రాణించిన రైతుబంధు, రాజకీయరారాజు, ఆచార్య గోగినేని రంగనాయకులు.
ప్రజాప్రతినిధిగా పార్లమెంట్లో సుధీర్గకాలము నిస్వార్దంగా సేవలనందించినందుకు గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రెకార్డ్స్ పుటల్లోకి ఎక్కిన మన తెలుగు వెలుగు ఆచార్య యన్.జి.రంగా గారు.
1946 లో కోపెంహజెన్ లో జరిగిన ఆహార వ్యవసాయ సంస్థ సభల్లో భారతీయ ప్రతినిధిగాను, 1948 లో సాన్ ఫ్రాన్సిస్కో లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంస్థ సభల్లోను, 1952 లో ఒట్టావా లో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొనడం, 1952 లో న్యూయార్క్ లో జరిగిన అంతర్జాతీయ రైతు సంఘం లో ప్రాతినిధ్యం, 1955 లో టోక్యో లో జరిగిన ప్రపంచ ప్రభుత్వ ఆసియన్ కాంగ్రేస్ సమావేశాల్లోను, తన ప్రతిభాప్రాతినిధ్యాన్ని అందించి భారతీయతకు, రాజకీయానికి, రైతులసమస్యలను, సంక్షేమాన్ని నొక్కి వక్కాణించిన నిస్వార్ధ ప్రతిభామూర్తి యన్. జి.రంగా గారు.

రైతాంగానికి వీరు చేసిన విశిష్టసేవలకు తార్కాణంగా, 1997లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ను 'ఆచార్య యన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం'గా నామకరణ చేసారు. 
1991 లో భారత ప్రభుత్వం వీరికి పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.రైతుబంధువుగా ఆచార్య రంగా చేసిన సేవలు నిరుపమానమైనవి.

Comments